Why Lord Ayyappa is Worshipped as a Celibate at Sabarimala: అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య ( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.

మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి – సోమవారము నాడు జన్మించారు . జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన ‘ధర్మశాస్త’గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి ‘ధర్మశాస్త’ అనే పేరు కూడా ఉంది.

దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.


